ప్రియపాఠకులారా! దేవుడు ఈ లోకమును చేసి అందులో జీవాత్మను సృజించాడు. ఈ లోకములో సృజించబడిన ఈ ఆత్మలో నుండి ఈనాడు అనేక ఆత్మలు ఒకదాని తరువాత ఒకటి వచ్చుటకు మార్గము ఏర్పడి అలా వచ్చినవారమే మనమందరము. ఇందులో ఈనాడు క్రైస్తవులు, అన్యులు ఉన్నారు. క్రైస్తవులను క్రీస్తు ప్రభువు యెరూషలేము కుమార్తెలుగా వర్ణించాడు. అన్యులను బబులోను అను మహావేశ్యతో వర్ణించాడు. ఇక వీరిద్దరు కాక ఇంకొక రకము స్త్రీని వర్ణించుట జరిగింది. ఆ స్త్రీయే నల్లనిదియైన స్త్రీ. ఈ స్త్రీ పేరు షూలమ్మీతీ అని చెప్పబడింది. అంటే జీవాత్మగా ఈ లోకమునకు వచ్చిన తరువాత వారి క్రియలను బట్టి జీవాత్మ ముగ్గురు స్త్రీలుగా విభజింపబడినారు. వీరు నిజానికి వధువు సంఘముగా ఏకసంఘముగా ఉండ వలసినవారు. క్రీస్తు ప్రభువు ప్రియునిగా ఈ ముగ్గురు స్త్రీల మధ్య జరిగే సంభాషణయే ఈ పరమగీతము. క్రీస్తు ప్రభువు బబులోను అను స్త్రీ సంఘములో ఉన్న నశించువారిని వర్ణించుటయేగాక వారిలో మార్పును తీసుకొని వచ్చుటకు తాను పడే శ్రమను ఇందులో వర్ణించుట జరిగింది. అలాగే బబులోను సంఘములో నుండి యెరూషలేము కుమార్తెగా నిజ క్రైస్తవ విశ్వాసములోనికి మారుచున్న విశ్వాసి యొక్క అన్వేషణ, వారిలో నిజమును తెలుసుకోవాలన్న తపన ఇందులో బహుసుందరముగా వర్ణిస్తూనే, పాతనిబంధనలోని యెరూషలేము దేవాలయము, నూతన నిబంధనలో మరియమ్మ యొక్క ఎన్నిక, యేసు తన ప్రేమను సిలువ రూపములో ప్రదర్శించుట, ఈ లోకములో క్రీస్తు ప్రభువు యొక్క బాధ్యతను శిరసావహించి ఆయన కాడిని మోయు సేవకులు వెయ్యి రూపాయలు సంపాదించగా ఈ లోకములో తాము పొందిన శ్రమగా క్రీస్తు ప్రభువు ముందు సమర్పించగా ఆయన వారి క్రియల చొప్పున ప్రకటన 2, 3 అధ్యాయములో వలె తీర్పు దినమున తిరిగి రెండువందల రూపాయలు అనగా అనేక బహుమతులను పొందుట, జీవాత్మలో పరిశుద్ధాత్మ క్రియలు, చివరిగా ఈ లోకములో క్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చిన ఆయన తల్లియైన కన్య మరియమ్మ క్రీస్తు ప్రభువును వరునిగా సిద్ధపరచి ఆయనకు కిరీటమును ధరింపజేయుట, అందుకు యెరూషలేములో వారసత్వము పొందిన విశ్వాసులను చూచుటకు పిలుచుట, మొదలైనటువంటి అద్భుతమైన సంఘటనలతో ఇందులో ఒకే ఒక గీతముగా రచించుట ఇది ఒక అద్భుతము. దీనిని ఆమూలాగ్రము చదివి ఒక అనుభూతిని మరొకసారి పొందమని గ్రంథకర్తగా నేను ఆపేక్షిస్తున్నాను. . . .