త్రైత సిద్ధాంత జ్ఞానముతో విరాజిల్లబోతోన్న ఈ త్రైత శకమునకు వ్యవస్థాపకులైన శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే వంద (౧౦౦) కు పైగా సంచలనాత్మక గ్రంథములు మరియు రెండు వందల (౨౦౦) కు పైగా ఆధ్యాత్మిక ప్రవచనములు సర్వ మానవాళికి అందించబడ్డాయి. నేటికే అట్టి ఆ స్వామివారి గ్రంథముల, మరియు ఉపన్యాసములలోని జ్ఞానస్థాయి ఏమిటో ఎందరో భక్తులు రుచిచూసియున్నారు. వాటిలోని జ్ఞానశక్తికి ప్రజలు నీరాజనాలు పలుకుచున్నారు. నిజమైన ఆధ్యాత్మికమంటే ఇదే! అనేలా శ్రీ స్వామివారి రచనలు ఉన్నాయనుట అతిశయోక్తి కాదు.
https://www.thraithashakam.org/
త్రై అనగా మూడు అని మనకు తెలుసు. ఈ త్రైత శకమున ఏదైనా మూడు భాగములుగానే ఉండేలా గురుదేవులు నిర్ణయించారు. ఆ క్రమములో భాగముగానే, సాక్షాత్తూ భగవత్స్వరూపులైన శ్రీ యోగీశ్వరులవారే తన గ్రంథముల మరియు బోధలలోని సారమునంతయూ రసముగా తీసి, ఎంతో జ్ఞానమునూ, మరెంతో జ్ఞానశక్తిని నింపి ప్రజలకు అందజేయ సంకల్పించి ప్రసరిస్తున్నవే "జ్ఞానవాహిని" గీతములు.
శ్రీ స్వామివారు, తానే స్వయముగా భౌతికంగా రచియించిన జ్ఞాన గీతములకు "గీతం-గీత" అను నామకరణము చేయగా, తాను అభౌతికముగా తన శిష్యులచే రచియింపజేసిన జ్ఞాన పాటల ప్రవాహమునకు "జ్ఞాన వాహిని" అను నామకరణము చేసినారు.
సంగీతమును - జ్ఞాన గీతములను గూర్చి గీతం-గీత ముందు మాటలో శ్రీ స్వామి వారు ఇలా అన్నారు:
"మహాశయులార ప్రపంచ పుట్టుకలో సంగీతమనునది లేదు. సృష్ట్యాది గడచిన కొంత కాలమునకు మానవుని హృదయమునుండి పొంగిన భక్తి భావనలే సంగీతమైనది. ఆనాటి భక్తి స్వచ్ఛమైన సంగీతముతో కూడుకొని యుండెడిది. ఒక భక్తి కోసమే సంగీతమనుట ఆనాటి మాట. కాని ఈనాడు ఒక భక్తిరసములోనేకాక అన్ని రసములలో సంగీతము చేర్చబడినది.
నేటి కాలములో అందరికి సంగీతము తెలియదు. కాని అందరికీ వాడుకలోనున్న సంగీత లయలు మాత్రము తెలుసును. కావున భక్తి విషయములను వారికి తెలిసన సంగీతలయలలో తెలిపితే ఆవిధముగనైన భక్తి భావనలు వారికి తెలియునను ఉద్దేశముతో చిత్ర సంగీతలయలతో భక్తి రసాన్ని కూర్చి పెట్టబడినదియే ఈ పుస్తకము కాన పాఠకులగు మీరు మంచి మనసుతో మా వుద్దేశముతో ఏకీభవిస్తారని నమ్ముతున్నాము.
ఇందులో ఆత్మను బోధించు పాటలను తత్వములను ఉంచున్నాము. అట్లే ఒకవ్యక్తి గొప్ప తనమును (కీర్తిని) గురించి చెప్పిన పాటలే కీర్తనలుగు నున్నవి. అందువలన కీర్తనలు, తత్వములనుట జరిగినది." ఇట్లు - ప్రబోధానందస్వామి
పై మాట గీతం గీతను గూర్చి చెప్పినది కాగా, ఇక "జ్ఞాన వాహిని"ని గూర్చి స్వామి వారు అనేక సందర్భములలో ప్రస్తావిస్తూ ఇలా అన్నారు,
జ్ఞానవాహిని గీతములు ..
- భక్తి భావములు సన్నగిల్లిపోవుచున్న నేటి ఆధునిక సమాజమునకు, నిజమైన భక్తి భావమును పరిచయము చేయుననీ,
- బలహీన పడుచున్న ధర్మమునకు బలమును చేకూర్చి, అధర్మములను ఖండించుననీ,
- దేహము బయటే ధ్యాస నిండిన జనులకు, దేహములోని ఆత్మ జ్ఞానమును వివరించి చెప్పననీ,
- వ్యర్థమైన భజనలు, కోర్కెలతో కూడిన కీర్తనలకు వ్యతిరిక్తముగా, భగవంతుని కొరకు చేయు నిజమైన భజనను, తత్వముతో కూడిన గురు కీర్తనలను ప్రజలలోనికి ప్రసరింపజేయుననీ,
- బాహ్యముగాయున్న అజ్ఞాన సాంప్రదాయములను సత్యవాదముతో ఖండించుచూ, ఆత్మజ్ఞానమునకు సరిపడు విప్లవమును ప్రజల హృదయములోనికి తెచ్చుననీ,
- ఈ జ్ఞాన గీతములు దైవ ప్రేరణా శక్తితో పుట్టి, రాగవంతమైన శృతి లయలతో కూడి, శ్రోతలను మరియు వీక్షకులను యోగీశ్వరుల వారి గ్రంథముల వద్దకు తీసుకొని రాగలవని ...
ఆశీర్వదించి చెప్పియున్నారు.
కావున, ఈ జ్ఞానవాహిని ప్రసారముచేయు జ్ఞాన గీతములను శ్రద్ధతోనూ, బుద్ధి విచక్షణతోనూ, అసూయలేక విని 'త్రైత జ్ఞాన అమృతమును' ఆస్వాదించి తరించగలరని ఆశిస్తున్నాము.
Aktualisiert am
21.07.2024