వ్యాపార విస్తరణలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని కొనుగోలుదార్లను ఆకర్షించేందుకు ఇ-కామర్స్ సంస్థ స్నాప్డీల్ సిద్ధమవుతోంది. ఆ ప్రాంతాల నుంచి విక్రేతల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తున్నామని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ ఎఫైర్స్) రజ్నీశ్ వాహి ఇక్కడ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 50,000 మంది కొత్త విక్రేతలు తమ వద్ద నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 లక్షల మంది విక్రేతలు తమ వద్ద వస్తువులను విక్రయిస్తున్నట్లు తెలిపారు. తమ ప్రాంతంలో ఉన్న వారికి ఏం అవసరమవుతాయనే విషయం స్థానిక వ్యాపారులకే ఎక్కువగా అర్థమవుతుందని, అందుకే దీనిపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ వస్తువుల కొనుగోలుకు వెచ్చిస్తున్న మొత్తం 80000 కోట్ల డాలర్ల మేరకు ఉందనీ, 2025 నాటికి 2లక్షల కోట్లకు చేరుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లు తమకు ఎంతో కీలకంగా ఉన్నాయనీ..ఇక్కడ నుంచి 25,000 మంది విక్రేతలు తమ వద్ద నమోదైనట్లు చెప్పారు.
అప్డేట్ అయినది
12 మార్చి, 2023