ఆదికాండము 1:26 దేవుని పోలికగా ఆయన స్వరూపములో సృష్టించబడిన ఆదినరునికే సాటి సహాయినిని అనుగ్రహించినప్పుడు దేవునికి కూడ సాటి సహాయమున్నదని గ్రహించాలి. దేవునికి సాటి సహాయము పరలోక భూలోకాలు అనగా అనంత విశ్వము, ఇందులో ఏడు ఆకాశాలు అంతేగాక మహాకాశాలు దేవుని నక్షత్రాలు సభా పర్వతము వగైరా సమస్తము దేవుని సాటి సహాయమని గ్రహించాలి.
యేసుక్రీస్తు యొక్క సాటి సహాయము తన రక్తముతో కడగబడి శుద్ధీకరించబడిన పరిశుద్ధ సంఘము, ఇదియే వధువు సంఘము గొఱ్ఱెపిల్ల భార్య.
పవిత్రాత్మ దేవునికి భార్య ఎవరు? యేసుక్రీస్తు తల్లియైన కన్య మరియమ్మగారు. యేసుక్రీస్తు యొక్క దివ్యరూపము పరిశుద్ధాత్మ వలన మరియ గర్భములో రూపించబడింది. ఆ మరియ శిశువును తన గర్భమున భరించుటకు ఏ విధమైన శరీర బలహీనతలకు లోను గాకుండుటకు సర్వోన్నతుని దివ్యశక్తి ఆమెను ఆవరించి ఆమె యొక్క శారీర ఆత్మీయ జీవితాలను మరెక్కువగా బలపరచినట్లు లూకా 1:35 వివరిస్తుంది.
పరమాత్మ ఆదాము యొక్క ఎముక దానిని అంటియున్న రక్తమాంసాదులతోను ఆదాము జీవములోను భాగము తీసుకొని స్త్రీని ఏర్పరచినట్లే పరమాత్మ కూడ తన ఆత్మలోని కొంత భాగమును విడదీసి, ఈనాడు మనకు కనబడుచున్న ఈ సమస్తమును అంతేగాక అదృశ్యములో ఆత్మలు నివసించు పరలోకమును పరమాత్మకు నివాస యోగ్యముగా భూలోకములో వలెనే కొండలు లోయలు నదీనదములు బంగారు వజ్ర వైఢూర్యములు వృక్షజాలము రాజ వీధులు సింహాసనాలు వగైరా సమస్త వైభవముతో పరలోకమును సృష్టించి దానిని తనకు ఇష్టమైన అనగా ప్రకటన 12:1లో వలె లోక నక్షత్రాలతో గాక దేవుని నక్షత్రాలతోను చంద్ర కళాకాంతులతోను, అత్యంత విశాలమైన తేజో ప్రాభవములతో నిండిన సభాపర్వతమును సృష్టించుటయేగాక, మానవ విజ్ఞానానికి వాని ఊహలకు అందనట్టి ఆకాశ మహాకాశాలను సృష్టించి పరలోక సామ్రాజ్యమంతటిని ప్రకటన 2:17లో వలె పాలవంటి నిగనిగలాడుచు ప్రకాశించు తెల్లని రాళ్లతో అలంకరించి ఆ పరలోకమును తనకు సాటి సహాయినిగా చేసుకొని, ఆ పరలోకములో తన సింహాసనాన్ని ప్రతిష్టించుకొని, భూమిని తన పాదపీఠముగా చేసుకొని ప్రస్తుతము భూలోకాన్ని నిరాకారముగాను అనగా ఏ అలంకారాలు లేకుండ వదలివేసినట్లు ఆదికాండము 1:2 వివరిస్తున్నది. ఇది దేవుడు ఎప్పుడు తాను ఆదియై యున్నాడో అప్పటి భూమియొక్క ఈ లోక స్థితియని చెప్పవచ్చును.
అయితే ఆదాము ద్వారా లోకములో జనసంతతులను నింపుటకు పరమాత్మ ప్రయత్నించినప్పుడు యెషయా 6:3లో చెప్పబడినట్లు సర్వలోకమును పరమాత్మ తన మహిమతో నింపియున్నాడు. ఇందునుబట్టి ఈ విశాల ప్రకృతియే పరమాత్మ యొక్క సాటి సహాయమని తెలుస్తున్నది.
పరమాత్మ తన ఆత్మను క్రీస్తు యొక్క జీవముతో ఐక్యపరచి నరుని నాసికా రంధ్రములలో ప్రవేశ పెట్టినందున నరుడు జీవాత్మ కలిగినవాడాయెను. సమస్త జీవరాసులను భూగర్భమునుండియు జలగర్భమునుండియు సృష్టించాడు. ఒక్క నరుని మాత్రమే క్రీస్తు యొక్క జీవమును పరమాత్మ యొక్క ఆత్మ అణువును జతపరచి ఏకము చేసి నరుని సృష్టించినట్లు ఆదికాండము 2:7 వివరిస్తున్నది. అంటే యేసుక్రీస్తు యొక్క దివ్య జీవమును నరునియొక్క నాసికారంధ్రములలో ప్రసరింపజేయగా ఆ జీవము పరమాత్మ యొక్క ఆత్మ అణువును ఆకర్షించి జీవాత్మగా మారింది. కనుక యేసుక్రీస్తు యొక్క సాటి సహాయమే నరులని తెలుస్తున్నది. ఎందుకంటే యేసు యొక్క జీవవాయువులోను జీవవృక్షములోను జీవాహారమైన ఆయన దివ్య శరీరమే పరలోకపు మన్నాగాను మరియు జీవజలములోను భాగస్వామిలగుటయేగాక యోహాను 1:4 యేసయ్యలోని జీవము మనుష్యులకు వెలుగై యున్నందున ఆయనే మనకు నిత్యజీవము దయ చేయుచుండుట వలన యేసు యొక్క సాటి సహాయము ఆయన రక్తములో శుద్ధి చేయబడిన పరిశుద్ధుల సంఘమని, అదియే వధువు సంఘమనియు ఈ లోకములో ఎంత మగధీరుడుగా జీవించినను హవ్వ చేతిలోని దైవ నిషేధఫలములు తిని స్త్రీకి వశుడైనందున వధువు సంఘములో చేర్చబడియున్నాడు.
అయితే పరిశుద్ధాత్మ కార్యాలేమిటో తెలుసుకొందము. ఈయన సాటి సహాయము ప్రభువు తల్లి మరియమ్మయే. అయితే ఈయన కార్యాలేమిటంటే - పరమ తండ్రియైన యెహోవా యొక్కయు, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసయ్య యొక్కయు కార్యాలలో సహకరించి మంచితనముగాను పరమాత్మకు ప్రసిద్ధముగాను మార్చుచున్న శక్తిమంతుడని తెలుస్తున్నది. ఆదికాండము మొదటి అధ్యాయములో తండ్రి - కుమారులు కలిసి సృష్టించిన ప్రతిదానిని మంచిదిగాను యోగ్యముగాను చేసినట్లును ఇందునుగూర్చి అది మంచిదని దేవుడు చూచినట్లుగా ఏడుమార్లు వ్రాయబడియున్నది. మరియు క్రీస్తు జన్మకు మరియమ్మను సిద్ధపరచి శిశు రూపమును ఆమె గర్భములో నిర్మించింది పరిశుద్ధాత్మయే.
ఇంకను పరిశుద్ధాత్మ చేయు పనులేమిటంటే మనము చేయు ప్రార్థనలకు సహాయముగా విజ్ఞాపన చేయుదురని రోమా 8:26-27 వివరిస్తున్నది. అంతేగాక క్రీస్తును నమ్మినవారి ఆత్మలను నూతనపరచుచున్నారనియు, క్రైస్తవులలో నివసించి సర్వసత్యములోనికి నడిపించుదురనియు యోహాను 20:22 మోక్షమునకు సంచకరువుగాను పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు మనతో నుండురనియు యోహాను 16:13 సత్య స్వరూపియైన ఆత్మ వచ్చి మనలను సర్వసత్యములోనికి నడిపించుననియు - అంతేగాక సంభవించబోవు భవిష్యత్తును తెలియజేయ శక్తిమంతుడైయున్నాడు. ఈ విధముగా యేసయ్య నామమును విశ్వసించిన ప్రతివాని ఆత్మను పవిత్రపరచి - మోక్షమునకు మార్గము సత్యము జీవమైయున్న క్రీస్తు యొక్క పరలోక రాజ్యమునకు విశ్వాసులను వారసులుగ చేయుటయే పరిశుద్ధాత్ముని క్రియయని గ్రహించాలి.