మోషే క్రీస్తు ప్రభువునుగూర్చి చెప్పుచూ ద్వితీయోపదేశకాండము 18:16-19, ‘‘ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది; వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దానిగూర్చి విచారణచేసెదను.’’ నావంటి మరో ప్రవక్త మీ మధ్యకు, మీ సహోదరులలో వచ్చునని ఆయన చెప్పినట్లు తిరిగి మీరు అనుసరించాలని అంతమువరకు తాను ఉపదేశించిన ధర్మశాస్త్రమును పాటించాలని బోధించాడు. మోషే నుండి క్రీస్తు ప్రభువు ముందు వరకు అనేకమంది ప్రవక్తలు వచ్చినను ఎవ్వరు ధర్మశాస్త్రములో మార్పులు చేర్పులు చేయలేదు. ఒక్క క్రీస్తు ప్రభువు మాత్రమే అనేక మార్పులను నూతన విధానములో చేసి ఆ విధముగా అనుసరించమని చెప్పుట జరిగింది. ఆ తరువాత కొంతమంది ప్రవక్తలుగా చెప్పుకొంటూ క్రీస్తు ప్రభువుకు వ్యతిరేకముగా బోధించుచు తిరిగి మోషే ఏర్పరచినవే అనుసరించాలని బోధించినట్లుగా పౌలు తన బోధలలో చెప్పుచూ - వీరిని అబద్ధ ప్రవక్తలుగాను అబద్ధ బోధకులుగాను వర్ణించాడు. ఏదిఏమైనప్పటికి మోషే చెప్పిన విధముగా క్రీస్తు ప్రభువు తరువాత క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా అనుసరించుట శ్రేయస్కరము. ఎందుకంటే మోషే నావంటి మరో ప్రవక్త అన్నాడుగాని మరో ప్రవక్తలు ఇద్దరు లేక ముగ్గురు వస్తారు. వారు మార్పులు చేసినట్లుగా మారుచుండుడని చెప్పలేదు. కనుక క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా దేవుని ఆజ్ఞలను గైకొని ప్రభువునందు విశ్వాసముంచిన నావంటి వారందరు ధన్యులే! వారితో నేను పాలి భాగస్తుడనేగాని ప్రత్యేకింపబడినవాడను కాను! కనుక ఈ పుస్తకమును క్షుణ్ణముగా చదివి అందులో వచ్చిన మార్పులను గ్రహించాలని నేను మనసారా ప్రతి ఒక్కరిని కోరుచున్నాను.